Wednesday, October 28, 2009

అమ్మమ్మ-అల్జీమర్స్



[alzheimers-ribbon.jpg]
సెప్టెంబరు 21, ప్రపంచ అల్జీమర్స్ రోజు

ముసలితనం కన్నా భయంకరమైన జబ్బు ఇంకొకటి లేదట!

ప్రపంచంలో ఏ జబ్బుకయినా మందులు ఉన్నాయి, ఉపశమనం ఉంది.....కాన్సరు, ఎయిడ్సు లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చు కానీ ఈ ముసలితనం అన్నది చికిత్స లేని జబ్బు అని సెలవిచ్చాడు ఓ మహానుభావుడు. మరి ఈ చికిత్స లేని జబ్బుకి తోడు ఇంకో చికిత్స లేని జబ్బు తోడయితే.......ఆ వ్యక్తి పరిస్థితేమిటి? అదే అల్జీమర్స్.....వయస్సుతో వచ్చే మతిమరుపు రోగం.... .అది కూడా భయంకరమయిన ప్రాణాంతకమయిన మతిమరుపు.



ప్రస్తుతం ప్రపంచంలో 65 ఏళ్ళకు పైబడిన వారిలో 5 శాతం మంది ఈ వ్యాది భారిన పడుతున్నారని ఓ అంచనా. దీని ముఖ్య లక్షణం జ్ఞాపకశక్తి క్షీణించటం. మతిమరుపు అన్నది మన అందరిలో కొద్దొ గొప్పో ఉంటూనే ఉంటుంది. వయస్సు పైబడే కొద్ది అది కాస్త ఎక్కువ అవుతుంది. కానీ ఆ ఎక్కువవటం అన్నది ఈ వ్యాధిగ్రస్థుల్లో ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ మతిమరుపుతో రోజురోజుకి వారి దైనందిక జీవితం దుర్లభంగా మారుతుంది. ఏదీ గుర్తుండదు. అన్నం తిన్నది లేనిది గుర్తుండదు. ఇంట్లోని తన మనుషులే తనకి గుర్తుండరు.... పేర్లు గుర్తుండవు, బంధుత్వాలు గుర్తుండవు...... జీవితంలో అనుభవాలు, అనుభూతులు ఏవీ గుర్తుండవు.

మొదట్లో వర్తమానానికి గతానికీ మధ్య రంగుల రాట్నం తిరుగుతూ ఉంటారు. తరువాత తరువాత గతం, వర్తమానం ఏమీ గుర్తుండవు. అంతా అయోమయం...శూన్యం.....ఆ శూన్యంలో నుండి వచ్చే అసహనం, కోపం, చిరాకు....... స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం లాంటి దైనందిక పనులు కూడా చేసుకోలేరు. కొన్నాళ్లకి మాట్లాడటం, వ్రాయటం, నడవటం కూడా చేయలేరు. వారి జ్ఞాపకాలన్నీ బ్రతికుండగానే సమాధి అయిపోతాయన్నమాట! ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మన ఇంట్లోనే ఉంటే!!


[al2.jpg]
అవును మా అమ్మమ్మకి ఓ మూడు నాలుగు సంవత్సరాలనుండి ఈ వ్యాధి ఉంది. ఆమె వయస్సు 80 పైనే. ముందు మామూలు వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు అనుకున్నాం. తరువాత తరువాత అసలు రోజూ చూసే మనుషుల్ని కూడా గుర్తుపట్టటం మానేసింది. నేను దాదాపు రెండు మూడురోజులకి ఒకసారి తన దగ్గరకి వెళ్లేదాన్ని. ఒక్కో రోజు బాగానే గుర్తు పట్టేది.....ఒక్కో రోజు నువ్వెవ్వరివమ్మా అని అడిగేది. ఏంటమ్మమ్మా నేను అంటే ఏమోనమ్మ గుర్తురావటం లేదు అని అమాయకంగా ఓ నవ్వు నవ్వేది. మీ లక్ష్మి గారమ్మాయిని అంటే మళ్లీ కాస్త జ్ఞాపకం వస్తా!! మొదట్లో మాకు ఇదంతా కొంచం వినోదంగానే ఉండేది......తరువాత తరువాత అర్థం అయ్యింది ఈ మతిమరుపు ఎంత బాధాకరమో. తనకే కాదు ఇంట్లో వాళ్లకి కూడా దాంతో చాలా ఇబ్బందే.

అన్నం తిన్న కాసేపటికే ఏంటి ఇవాళ నాకింకా అన్నం పెట్టలేదు పెట్టు అంటూ వచ్చి టేబులు దగ్గర కూర్చుంటుంది. ఉండుండి గతంలోకి వెళ్లిపోతుంది...అక్కడే బ్రతికేస్తుంది.....ఇక ఆమె ఆలోచనలు అప్పటినుండి ఇప్పటికి రావు....అక్కడే ఆగిపోతాయి. ఆమె మేనత్తలు, మేనమామలు, ముసలమ్మలు... అన్నయ్యలు, వాళ్ల పిల్లలు....తను అప్పటి జీవితంలో ఎవరితో అయితే ఎక్కువ సన్నిహితంగా ఉందో వాళ్లందరూ గుర్తుకొస్తారు. వాళ్లందరూ (పోయినవాళ్లతో సహా) ఇప్పుడు తనతో ఉన్నారనుకుంటుంది.

అప్పట్లో పొద్దున్నే లేచి గొడ్ల దగ్గరికి వెళ్ళి పాలు తీయటం, వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు వేయటం.....ఇవన్నీ గుర్తుకొస్తాయి....పాలుపిండే టైము అయింది చావిడి దగ్గరికి వెళ్ళాలంటూ హడావిడిగా బయలుదేరుతుంది! ఒక్కోరోజు అర్థరాత్రి లేచి తెల్లవారింది వాకిలి ఊడవాలి అంటూ చీపురు పట్టుకు బయలుదేరుతుంది. ఇక మామయ్య వాళ్లు తలుపులకి తాళం వేయటం ప్రారంభించారు. మొన్నొక రోజు ఇలానే రాత్రిపూట లేచి వాకిలి ఊడవాలి అంటూ చీపురు కోసం చీకట్లో దేవులాడుతూ పడి కాలు తుంటి విరగ్గొట్టుకుంది, దానికి ఆపరేషన్..... ఆరు వారాలు బెడ్ రెస్టు....ఎంత నరకమో!!

ఈ మతిమరుపు అన్నది కూడా తెరలు తెరలుగా వస్తుందనుకుంటా! అప్పటిదాకా మామూలుగా ఉందల్లా హఠాత్తుగా లేచి అమ్మాయి నేనొచ్చి చాలా సేపయిందిగా ఇక నేను మా ఇంటికి వెళతా అంటూ బయలుదేరుతుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు కాపలా ఉండాలి. ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు వేరే ఎక్కడికయినా వెళ్ళొస్తే తనకి ఇల్లు మనుషులు అంతా కొత్తగా కొత్తగా అయోమయంగా ఉంటుంది. బాత్రూం ఎక్కడో...వంటిల్లు ఎక్కడో....బెడ్ రూము ఎక్కడో అన్ని మర్చిపోతుంది....అన్నీ మళ్లీ అలవాటు చేయాలి.

వీళ్లతో వ్యవహరించటం కూడా చాలా కష్టమే. ఊరికే కోపం వస్తుంది. నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అంటే మా అమ్మమ్మకి ఎంత కోపమో. వీళ్లని పసిపిల్లలకి మల్లే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లతో వాదనలు పెట్టుకోకూడదు. స్నేహభావంతో మెలగాలి. వాళ్లు చేస్తామన్న పనులు చిన్నవి చిన్నవి చేయనివ్వాలి, కాకపోతే ఎవరో ఒకరి పర్యవేక్షణ ఉండాలి.
[alz4.jpg]
ఇదంతా ఒక ప్రత్యేకమైన జన్యువులో లోపం వల్ల వస్తుందట. పల్లెటూర్లలో వారికంటే పట్నాలలోని వారికి ఎక్కువగా వస్తుందట. ఒంటరి జీవులకు ఇది మరీ తొందరగా వస్తుందట....ఆడవారికి మరీను. ఇది రాకుండా నివారించటానికో వచ్చాక తగ్గించటానికో ప్రత్యేకమయిన చికిత్స కాని మందులు కాని లేవనే చెప్పొచ్చు. మన దేశంలో దీని గురించి ప్రజలలో అవగాహన కూడా తక్కువే. ఇప్పుడు ఏవో స్క్రీనింగులు, టెస్టులు- MMSE (Mini Mental State Exam) వచ్చాయి....ముందుగా గుర్తించవచ్చు అంటున్నారు కాని అవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లోనే అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక మన దేశంలో విస్తృతంగా రావటానికి చాలా సమయం పట్టవచ్చు. మనదేశంలో కూడా వీళ్ల కోసం ఓ సొసైటీ ఉంది.

అసలు మనిషి ఆయుర్దాయం పెరిగేకొద్ది ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. బుర్రకి ఎప్పుడూ ఏదో ఒక పని పెడుతుంటే ఈ జబ్బు వచ్చే అవకాశాలు తక్కువట. అందుకే 50 దాటిన వారు పుస్తకాలు చదవటం, పజిల్సు ఎక్కువగా చేస్తుండటం లాంటివి చేస్తుండాలి అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అసలు నన్నడిగితే రిటైర్మెంటు దగ్గరపడ్డ వాళ్లందరికి బ్లాగులు చదవటం అలవాటు చేస్తే సరి, మేదడుకి మంచి మేత!!

మా అమ్మమ్మ లాంటి మరెంతమందో అమ్మమ్మలకి, తాతయ్యలకి ఈ టపా.

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070