Wednesday, February 3, 2010

కొడవటిగంటి రచనా ప్రపంచం




కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవలికను గుర్తు తెచ్చుకుని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

పది పన్నెండేళ్ళ వయసులోనే నవలలు చదివేసిన నాకు కుటుంబరావు గారి పరిచయం కేవలం పది పన్నెండేళ్ళ క్రితం జరగడం నాకే ఆశ్చర్యం! లోకం గొప్ప రచయితలుగా ముద్ర వేసిన కొందరు రచయితల రచనలు నన్ను అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుట్ పాత్ మీద కుటుంబరావుగారి నవలలు కొనడంతో ఆయన రచనా ప్రపంచం తలుపు తట్టాను. ఆ నవలికలు నన్ను అద్భుత రస ప్రపంచంలోకి విసిరి కొట్టాయి. మిగిలిన సంపుటాల కోసం ఎంతగా ప్రయత్నించినా అప్పటికే విశాలాంధ్రలో స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు.

కానీ ఆశ్చర్యకరంగా రెండు నవలా సంపుటాలు హ్యూస్టన్ మీనాక్షి ఆలయం లోని పుస్తక విక్రయకేంద్రంలో దొరికాయి.

కుటుంబరావు గారి శైలి గురించి, ఆయన పాత్ర చిత్రణ గురించీ,ఇంకా రచనా చమత్కృతి గురించీ వారి శత జయంతి సందర్భంగా అనేక ఆన్ లైన్ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్యాసాలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఇక్కడ దాన్ని నా దృష్టి కోణం నుంచి వివరించే ప్రయత్నం, చెయ్యను కానీ ఆయన రాసిన ఒక నవలికను పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఆలిండియా రేడియో సీరియల్ గా ప్రసారం చేయడానికి డైరీ రూపంలో ఒక పెద్ద కథ రాయమని కుటుంబరావు గారిని కోరినపుడు ఆయన 'సరితాదేవి డైరీ"ని రాశారు. అది ప్రసారం కూడా అయిపోయాక కుటుంబరావు గారికి అది అసంపూర్ణంగా ఉన్నట్లు తోచింది. ఆయన మాటల్లో ఇలా అంటారు

"కథ అయిపోయింది, అయిపోలేదు కూడా! ఎందుకంటే కథ తాలూకూ చాలా విషయాలు ఈ డైరీలోకి రాలేకపోయాయి.కష్టపడి కథ ఆలోచించిన రచయిత దాన్ని పాఠకులకు(శ్రోతలకు)అందజేయలేకపోయిన రచయిత ఎంత ఆందోళన చెందుతాడో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు! సరితా దేవి డైరీతో రేడియో మాసం దాటింది కానీ నా పని గడవలేదు.అందుచేత సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ రాశాను"!


ఈ రెండు డైరీలలో వచ్చే పాత్రలతో తర్వాత ఆయన "కామినీ హృదయం" అనే నాటిక కూడా రాశారు.


ఒకే కథను రెండు వైపుల నుంచీ ఇద్దరు తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా అద్భుతంగా చెప్పిన కథే ఈ "సరితా దేవి డైరీ" సరోజ డైరీలు!

కథ విషయానికొస్తే ........

సరితాదేవి ఒక మధ్యతరగతి తల్లి. ఆడపిల్ల తల్లి!

కథ చాలా కాలం నాటిది కనుక ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన కూతురికి అప్పుడే పెళ్ళి చెయ్యాలని,గొప్ప వరుడిని తేవాలని ఆరాటపడే సగటు తల్లి! చాలా మంది మధ్యతరగతి వాళ్ళకుండే రోగం....అదే గొప్పింటివాళ్లతో పోటీ పడాలని,ఒక్కోసారి గెలవాలని కూడా అనుకునే అభిజాత్యపు రోగం అంతో ఇంతో సరితాదేవిక్కూడా ఉంది.



రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయి సావిత్రి, సరితా దేవికూతురు సరోజా స్నేహితులు.ఇద్దరూ పెళ్ళికెదిగిన వాళ్ళే! ఈ నేపథ్యంలో సరితా దేవి తమ్ముడు వాసుతో పాటు ఢిల్లీ నుంచి మనోరంజన్ అనే అందగాడూ, మంచి ఉద్యోగస్తుడూ అందునా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరూ వస్తాడు.

 ఇటు సరితాదేవి, అటు సావిత్రి తల్లీ అతడిని తమ తమ కూతుళ్లకు వరుడిగా చేసెయ్యాలని ఆరాటపడతారు.అతడు తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకూ కూతురి పట్ల అతడికి ఆకర్షణ కలిగించాలని,సరోజను మిసెస్ మనోరంజన్ గా చేసెయ్యాలని సరితా దేవి చేసిన ప్రయత్నాలే ఆమె రాసుకున్న డైరీ!



మరో వైపు సరోజ మనో రంజన్ వైపు ఆకర్షితురాలవుతూనే,అతడిని ఇష్టపడుతూనే తన తల్లి చేసే "చవకబారు
ప్రయత్నాలు " తనకెంత చిరాకు పుట్టించాయో తన డైరీలో రాసుకుంటుంది.



సావిత్రితో మనోరంజన్ పెళ్ళి స్థిరమైపోయిందనే వార్త రూఢిగా తెలిశాక సరితాదేవి నిరాశలో కూరుకుపోతుంది.ఇది ఒక రకంగా ఆమెకు ఓటమి కూడా కదా సుశీల ముందు! ఆమె తమ్ముడు వాసు "సరదాగా నాల్రోజులు ఢిల్లీలో గడిపి వస్తుంది సరోజను పంప"మనడం,ఢిల్లీ వెళ్ళాక అక్కడ సరోజ, రంజన్ లు పెద్దవాళ్లకు తెలీకుండా వాసు సహాయంతో రిజిస్టర్ పెళ్ళి చేసుకోవడం కథలో చివరి ట్విస్టు!



మనో రంజన్ తనను ఇష్టపడుతున్నాడనీ, తననే పెళ్ళాడతాడనీ సరోజకు నిశ్చయంగా తెలుసు. మరో వైపు సావిత్రి తల్లి సుశీల చేసే ప్రయత్నాల మీద కూడ ఆమెకు అనుమానంగానే ఉంటుంది.
ఇంకో వైపు తల్లి! ఇలా నలుగుతూనే సరోజ ఈ కథంతా డైరీలా మనకి చెప్తుంది. తేదీల వారీగా రాసే డైరీల మీద కుటుంబరావు గారికి ఆట్టే నమ్మకం లేకపోవడం వల్ల సరితా దేవి, సరోజ... కథ చెప్పుకుంటూ వెళతారంతే!



రెండూ ఒకటే కథ అయినా ఎవరి వైపు నుంచి వారు చెప్పడం వల్ల రెండూ కొత్తగానే అనిపిస్తాయి పాఠకులకి!

ఇదొక అద్భుత రచనా ప్రక్రియ అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ, ఒకటే కథ రెండు వెర్షన్లలో ఇంత ఆసక్తి కరంగా మలచడం !.

ఒక మధ్యవయస్కురాలైన తల్లి, ఒక యుక్తవయస్కురాలైన కూతురు ఈ ఇద్దరి మనస్థత్వాలను కొ.కు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా తోస్తుంది.


సావిత్రి, తన తల్లి ఎంత చెప్తే అంతని, బుద్ధి మంతురాలనీ , తన కూతురు సరోజ మాత్రం పెంకిదనీ, తన మాట విని బాగుపడతామనే ఆలోచనే లేదనీ సరితాదేవి కంప్లెయింట్!

 మరో పక్క సరోజేమో "సావిత్రి వాళ్ళమ్మ మాట వింటుందనీ నేను వినననీ నా మీద కోపం!నేనూ విందునేమో అమ్మక్కూడా సుశీల గారికున్నంత నాగరికత ఉంటే! 'నేను నీకు అమ్మనని ఎప్పుడైనా అనిపిస్తుందిటే? నేనేం చెప్పినా నీ చెడు కోసమే చెబుతున్నాననుకుంటున్నావా?' అని నన్ను నిలవేస్తుంది. ఆవిడకర్థమయ్యేట్టు చెప్పడం నాకు చాత కావడం లేదు.ఆవిడ నా మీద ఆపేక్షతోనే చెబుతుంది.కానీ ఆవిడ చెప్పినట్లా చేస్తే నేను నవ్వులపాలైపోవలసిందే! ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అటువంటి మనిషి ఆపేక్షకు విలువేమిటి?"అని ఆలోచిస్తుంది.



నలుగురిలో కూతురు అందంగా కనిపించాలని ఏ తల్లికైనా ఉంటుంది.ఇదే తాపత్రయం సరితాదేవి కూడా పడి సరోజ ను చిత్తం వచ్చినట్లు అలంకరించి మనోరంజన్ కి కాఫీలు, టీలూ అందించమంటుంది. సరోజేమో సహజంగా ఉండాలనుకుంటుంది.



"నన్ను ఉన్నట్టు ఉండనివ్వక ఏ రాధలాగో, మహాలక్ష్మి లాగో, అనసూయ లాగో చేస్తానంటుంది. నాకు చిరాకెత్తి 'నేనేం బట్టల దణ్ణెం అనుకున్నావా, నీకిష్టమైన చీరల్లా నా మీద వేసి చూడ్డానికి? అని అడిగేస్తాను. దాంతో ఆవిడకు కోపం వచ్చేస్తుంది"అని మనతో వాపోతుంది.



తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలని ఆ కాలంలోనే(ఎందుకంటే ఇప్పటికంటే అప్పటి ఆడపిల్లలు తల్లి చెప్పినట్లు వినేవాళ్లని కదా అందరం అనుకుంటాం) రచయిత ఎలా పరిశీలించారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మనస్థత్వాలను కుటుంబరావు గారు మంచినీళ్ళ ప్రాయంగా అప్పటికప్పుడు విశ్లేషిస్తారని ఆయన రచనలు చదివిన వారికెవరికైనా అర్థం కావలసిందే! "తల్లి లేని పిల్ల" లో "మనుషుల సంస్కారం"అనే విషయాన్ని విశ్లేషించిన తీరు నేను ఎప్పటికీ అబ్బురపడే విషయమే! కొత్తకోడలు నవల్లో హనుమాయమ్మ గారి పాత్ర ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ దాదాపుగా కనపడే తల్లి పాత్ర!

ఈయన ఇన్ని రకాల మనుషుల్ని ఎప్పుడు చదవగలిగారని విస్మయం కలుగుతుంది. ఎందుకంటే ఒక రచనలో కనిపించిన మనో విశ్లేషణ మరో రచనలో కనిపించదు మరి! ఇటువంటి విస్తృత విశ్లేషణ అనేక కథల్లో, నవలల్లో, నవలికల్లో అసంఖ్యాకంగా చూడొచ్చు! ఎన్నని పేర్కొనగలం?

కుటుంబరావు గాని నవలల మీద పరిశోధన చేయదలిస్తే కొన్ని వందల అంశాల మీద వందల కొద్దీ చేయవచ్చు!

విశాలాంధ్ర  పబ్లిషింగ్ హౌస్ శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వేసిన సంపుటాలన్నీ చాలా రోజుల క్రితమే అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం అక్కడ దొరకదు. "వస్తాయండీ" అనో "వేయాలని చూస్తున్నారండీ'అనో "చెప్పలేమండీ" అనో తప్పించి!





ఈ లోపు విరసం ఈ బాధ్యతను తీసుకుని "కొడవటిగంటి రచనా ప్రపంచం" పేరుతో ఆయన రచనలన్నింటినీ 16 సంపుటాలుగా అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టడం శుభపరిణామమే!

మార్చి నెలలో దీనిగురించి వేణువు బ్లాగులో కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో ఒక టపా వచ్చింది. ఆ టపా ద్వారానే నేను ఈ సంపుటాలన్నింటికీ తెప్పించే ఏర్పాటు చేయగలిగాను. ఇప్పటికే నాల్గు సంపుటాలు అందాయి కూడా! ఈ కొత్త సంపుటాల్లో విశాలాంధ్ర సంపుటాల్లో లాగా ఫుట్ నోట్స్ లేవు. వివరాలు అవసరమైన చోట్ల ఆ ఫుట్ నోట్స్ ఉంటే బావుండనిపిస్తుంది. కానీ విశాలాంధ్ర సంపుటాల్లో అవి మరీ ఎక్కువై విసుగెత్తిస్తాయి, కథను పక్కదారి పట్టిస్తూ!

ప్రతి సాహిత్యాభిమాని లైబ్రరీ లోనూ  ఉండదగ్గ ఈ పదహారు సంపుటాలూ ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కింద అసలు ధర కంటే తక్కువ ధరకే లభించే సదుపాయం కూడా ఉంది. ( నాకు అలాగే లభించాయి.) విరసం వేసిన సంపుటాలు కావలసిన వారు పూర్తి వివరాల కోసం "కొడవటిగంటి రచనా ప్రపంచం ". టపాలో చూడవచ్చు!

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070